Monday, March 26, 2007

NTR అందం

ఐదారేళ్ళ క్రితమనుకుంటా ఎంటీవీ లో సైరస్ వేసిన ఎన్ టీ ఆర్ వేషం చూసి నేను, స్నేహితులు పగలబడి నవ్వుకున్నాము. యమగోల లోదేమో ఒక సన్నివేశాన్ని బెల్ బాటం పాంటు, పైబొత్తాలు పెట్టని చొక్కా, విగ్గేకాని ఇంకేదీ కాదని కనిపించే జుత్తు - నుదుటిన పడి మెలిక తిరిగిన రెండు వెంట్రుకలూ, వీటితో పాటు కనుబొమలు ఎగరేస్తూ "అమ్మా అమ్మా" అంటూ పరుగెట్టి వస్తున్న సైరస్ ని చూసి మనవాళ్ళూ అస్సలు ఎన్ టీ ఆర్ లో ఏమి చూసి అంత ఆకాశానికెత్తేసారని అనుమానము కలిగింది. పౌరాణికాలలో శ్రీకృష్ణుడి పాత్రల వలనేమో అని సరిపెట్టుకున్నా.

అంటే పాత సినిమాలు దూరదర్శన్ "తప్పదు రా భగవంతుడా; నాన్నకి ఇవి ఎలా నచ్చుతాయిరా బాబు" అనుకుంటూ చూడడం వల్లో, లేక పేర్లలో "స్టంట్స్" లేని సినిమాలేవీ సరిగ్గా చూడకపోవడం వల్లో - మిస్సమ్మ లాంటి గొప్ప సినిమాలు పెద్దగా గుర్తు లేవు మరి.
==
మళ్ళీ మిస్సమ్మ చూసి రెండు వారాలయ్యింది.
"కావాలంటే ఇస్తాలే, నావన్ని ఇక నీవేలే" పాటలో ఎన్ టీ ఆర్ ని చూసి అర్ధమయ్యింది - మామ్మలు, బామ్మలు, పెద్దత్తలు, పెద్దమ్మలు ఆయనది "చంద్రబింబం" లాంటి ముఖమని ఎందుకంటారో. మరంతటి అందగాడు డెబ్భై,ఎనభై దశకాలలో అంతటి మోటు వేషాలు ఎందుకు వేసాడో అని బాధ కూడా కలిగింది.
==
నాలాగే మీరూ ఐదారేళ్ళ క్రితం ఎంటీవీ చూసి నవ్వి ఉంటే - "మిస్సమ్మ" తప్పకుండా చూడండి. మీ opinions కొద్దిగా మారవచ్చు.

Saturday, March 24, 2007

ఎవరిది కపట నాటకం?

భూకైలాస్ లో సంగీత సాహిత్య పరంగా అన్నీ గొప్ప పాటలే; సముద్రాల రాఘవాచార్య రాసిన పాటలు ఎంతో బావుంటాయి. అందులోనూ "రాముని అవతారం" పాటంటే నాకు చాలా ఇష్టం..ముఖ్యంగా ఆయన
"అదిగో చూడుము బంగరు జింకా,
మన్నైచనునయ్యో లంకా,
హరనయనాగ్ని పరాంగన వంకా
అరిగిన మరణమె నీకింకా"
చరణంలో ప్రాసని చాలా బాగా కుదిర్చారనిపిస్తుంది.

కొన్ని రోజులనుంచి నన్ను తిప్పలు పెడుతున్న చరణం కూడా ఈ పాటలోనే ఉంది.
"కపట నాటకుని పట్టాభిషేకం,
కలుగును తాత్కాలిక శొకం,
భీకర కానన వాసారంభం,
లోకోద్ధరణకు ప్రారంభం"
అని శ్రీరాముని వనవాసప్రారంభం గురించి చరణం అది.
ఇంతకీ ఇక్కడ కపట నాటకమెవరిది? కైకేయిదా అనుకుంటే మరి పట్టాభిషేకం తనది కాదు; భరతునిదా అనుకుంటే మరి భరతుడికి కపటం లేదే. "కపట నాటకంతో కైకేయి కుదిర్చిన పట్టాభిషేకమని" అర్ధమని సరిపేట్టుకోవాలా?

Tuesday, March 06, 2007

మీకు తెలుసా?

1. మాయా బజార్ చిత్రానికి మొదట రాజేశ్వర రావు గారు సంగీత దర్శకులుగా పని చేసారు అని? ఆయన నాలుగు పాటలు కూడ స్వరపరిచారు ("చూపులు కలిసిన శుభవేళా", "నీకోసమె నే జీవించునది", "నీవేనా నను పిలచినది", "లాహిరి లాహిరి లాహిరిలో"), తర్వాత ఏదో గొడవల వల్ల మిగతా సంగీతం కూర్చడం ఘంటసాల గారి బాధ్యత అయ్యింది.
2. పాతాళ భైరవి సినిమాలో సావిత్రి నటించిందని? భలే రాముడు ఉజ్జయిని రాజపరివారానికి తన మాయామహలు వింతలు చూపిస్తున్నప్పుడు వచ్చే ఒక పాటలో ("ఇక రానంటే రానే రాను") ఓ రెండు నిమిషాల సేపు కనబడుతుంది సన్నటి సావిత్రి. ముఖాన్ని పట్టించి చూస్తే గాని గుర్తు పట్టడం కష్ఠం కాని నాట్యంచేసే తీరు బట్టి గుర్తుపట్టేయవచ్చు.

Monday, March 05, 2007

చెలువమంటే?

ఈ మధ్య పాత పాటలు వినడం పెరిగింది. దానితోపాటే ఆకాలం నాటి గొప్ప సంగీత దర్శకులు, పాటలు/పద్యాల రచయితలపై కూడా మక్కువ పెరిగింది. పింగళి, పెండ్యాల, సముద్రాల (రాఘవాచార్య), ఆత్రేయ, ఆరుద్ర, మహదేవన్, దేవులపల్లి, కోదండపాణి, రాజేశ్వర రావు వంటి వారి గురించి కుతూహలము పెరిగింది.
ఘంటసాల గారి గురించి వెతుకుతూ ఈ గొప్ప సైట్ ని కనుగున్నాను. ఎన్నో గొప్ప పాటలు, పద్యాలు ఉన్నాయక్కడ - అదే కాక కొన్ని పాటలకి ముందు ఘంటసాల గారితో పనిచేసిన వారి మాటలు ఉన్నాయి. వీలు దొరికితే మీరూ విసిటేయండి.
అడగదలచిన విషయమేమంటే, "చూపులు కలిసిన శుభవేళా.." పాటలో పింగళి గారు "చెలువములన్ని చిత్రరచనలే, చలనములోహో నాట్యములే" అని రాయగా, ఘంటసాల గొప్పగా పాడగా, నాగేశ్వర రావు గారు తెర మీద ఎంతో గొప్పగా పెదవులు క(ది)లిపారు కదా? అదిమనమందరమూ ఎప్పుడో ఒకప్పుడు వినడమో, చూడడమో జరిగిందే కదా?
పై రెండు ప్రశ్నలకీ మీరు ఒప్పుకుంటూ తలూపిఉంటే, మరి చెలువము అంటే ఏంటో చెప్పగలరా? నాకైతే (సందర్భాన్నిబట్టి) 'భంగిమ ' అని అనిపిస్తోంది. మీరేమంటారు?